నిర్మాణ దశలోనే అబ్బురపరుస్తున్న యదాద్రి దేవాలయ నిర్మాణం
యాదాద్రి భువనగిరి జూన్ 12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దేశంలోనే అరుదైన కట్టడంగా నిలువనుందా..? ప్రాకారాలు, శిల్పాలు అద్భుత శిలాఖండాలుగా కీర్తికెక్కనున్నాయా..? రాజుల కాలం తర్వాత అంతటి భారీ నిర్మాణంగా యాదాద్రి దేవాలయం చరిత్రకెక్కనుందా..?అంటే అవునంటున్నారు నిపుణులు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనలతో పురుడుపోసుకుని నిర్మాణం జరుపుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం నిర్మాణదశలోనే అబ్బురపరుస్తున్నది. కృష్ణశిలలతో రూపుదాల్చిన రాజగోపురాలు, ప్రాకార నిర్మాణాలు, ప్రధానాలయం కోసం వాడిన కాకతీయ శిల్పాలు, అళ్వార్ స్తంభాలు ఒక్కటేమిటి.. ఇక్కడి నిర్మాణంలో ప్రతీది విశేషమే. అద్భుత కళాఖండమే. యాదాద్రి పునర్మిర్మాణ పనులు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్స్వామి సూచనల మేరకు జరుగుతున్నాయి. స్థపతుల గోపురాలు, ప్రధానాలయం, ప్రాకారం, 108 దివ్యక్షేత్రాలు, శ్రీసత్యనారాయణ వ్రత మండపం, విష్ణుపుష్కరిణి, శ్రీవారి అద్దాల మేడ తదితర నిర్మానం కాబోతున్నాయి.
కాగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన శివాలయ పునర్నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వేగంగా పనులు జరుగుతున్నాయి. కాకతీయుల శిల్పశైలిని ఆవిష్కరించే విధంగా ఆద్భుతమైన శిల్పాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వెయ్యేళ్ల కాలపరిమితితో నిర్మాణం కోసం సిద్ధమైన కృష్ణశిలలను కొండపైకి చేర్చే పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శివాలయానికి సంబంధించి గర్భాలయ ప్రథమేష్టిక పూజ నిర్వహించారు.