యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవములు- 2021 రెండవరోజు
అత్యంత వైభవముగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలు
శ్లో|| మాతానృసింహశ్చ పితానృసింహః – భ్రాతానృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహో ద్రవిణం నృసింహః – స్వామీనృసింహ స్సకలం నృసింహః ||
కళావైభవం.కామ్ ప్రతినిధి శంకర్ పోతు గంటి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవములు- 2021 – రెండవరోజు (16-Mar) అత్యంత వైభవముగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలను నిర్వహించారు.
శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా ఈ రోజు తేది.16.3.2021 మంగళవారం ఉదయం శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్య ఆరాధనల అనంతరం ఉదయం గం.11.00లకు ధ్వజారోహణ కార్యక్రమము శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా ప్రధానార్చకులు, యాజ్ఞాచార్యులు, ఆలయ ఉప ప్రధానార్చకులు, అర్చక బృందము, పారాయణీకులు ఈ వేడుకను అత్యంత వైభవముగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. గీత , సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ప్రకటనలో తెలిపారు.
ధ్వజారోహణం ప్రత్యేకత:
బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవముగా నిర్వహించబడు ఉత్సవమే ధ్వజారోహణ మహోత్సవము. ధ్వజము అనగా కదిలేది అని అర్ధం, ధ్వజం స్తంభానికి కట్టుట వలన దానికి ధ్వజస్తంభం అనే పేరు సార్థకమైనది. బ్రహ్మాండ పురాణంలో ఈ వేడుక ప్రత్యేకతను తెలుపుతూ మొదట ధ్వజ దండాన్ని పూజించి అనంతరం తెల్లని వస్త్రము పై గరుత్మంతుని చిత్రించి 27 విధములైన ఉపచారములతో ఆరాధన గావించి చతుర్వేదములతో దేవతలను ఆవాహన చేసి వివిధ ప్రక్రియలలో విశేషమైన పూజలతో గరుడధ్యానం గావించి ముద్దల ప్రసాదమును (అనగా పెసరపప్పు అన్నం ప్రసాదముగా) నివేదన చేసి ఆ ప్రసాదమును సంతానము కోరు వారు స్వీకరించి సంతానవంతులు అగుట పేర్కొనబడినది. ఎన్నో విశేషమైన ఫలితములు ఈ వేడుకలో దర్శింపవచ్చు అని తెలిపారు.
సాయంకాల కార్యక్రమములు:
ఈ రోజు సాయంకాలము శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్యఆరాధనల అనంతరం భేరి పూజ, దేవతాహ్వానము, హవనము ప్రారంభించబడును. ఈ వేడుకలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చకబృందం నిర్వహించెదరు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొంటరరి అధికారులు తెలిపారు.
భేరి పూజ:
భేరితాడనం మంత్రపూర్వకంగా నిర్వహించెదరు. ఈ ధ్వని విని దుష్ట శక్తున్ని దూరంగా వెళ్ళిపోగలవు. ఉత్సవ కార్యక్రమము నిర్విఘ్నంగా జరగాలని భగవదారాధనతో వివిధ రాగ, తాళములతో అనేకములైన స్తోత్రపాఠములతో అత్యంత భక్తి భరితంగా ఈ వేడుక నిర్వహించారు.
దేవతాహ్వానము, హవనము:
బ్రహ్మోత్సవములకు మహాశక్తి సంపన్ను లైన దేవకోటిని ఆహ్వానింప చేయు ప్రక్రియే ఈ దేవతాహ్వానము. మంత్రపూర్వకముగా దేవతలను ఆహ్వానించి ఉత్సవములు నిర్వహింపబడు రోజులలో వారికి భక్తిశ్రద్ధలతో హవిస్సులు అందజేయగలరు. తద్వారా ప్రీతిని పొందిన దేవకోటి భక్తకోటిని అనుగ్రహించుట ప్రత్యేకత. హవనము ద్వారా దేవతలందరికీ హవిస్సును అందజేయుదురు. అగ్ని భగవానుడు ఈ హవిస్సును ఆయా మంత్రముల చేత ప్రతిపాదించబడిన దేవతలకు స్వయముగా అందజేయును. ఎంతో మహిమాన్వితమైన ఫల దాయకమైనదని ఈ వేడుక సూచించుచున్నది అని తెలిపారు.
ఉచిత వైద్యశిభిరము:
ఈ రోజు తేది.16.03.2021న డా|| మర్రి రాంరెడ్డి గారు ప్రిన్సిపల్, డివీస్ హోమియో మెడికల్ కాలేజి, కీసర, డా|| పి.శంకర్ ప్రొఫెసర్ అన్వీస్ హోమియోపతి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఉప్పల్, హైద్రాబాద్ వారిచే కొండక్రింద తులసీకాటేజి, నృసింహసదనం యందు ఉదయం గం.10.00ల నుండి మధ్యాహ్నం గం.1.00ల వరకు ఉచిత హోమియో వైద్యశిబిరము నిర్వహింపబడినది. సుమారు 200 మంది వరకు వీరి ఉచిత సేవలను పొందారని తెలిపారు.