“నేను కవి కంటే ముందు సినిమా ప్రేమికుడిని”, “సినివారం వేదిక మంచి సినిమాలకు కేంద్రంగానూ, యువదర్శకులకు ప్రోత్సాహకంగానూ ఉండటం అభినందనీయం” – డా. నందిని సిధారెడ్డి.
భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో రవీంద్రభారతి మొదటి అంతస్తులో ప్రతి శనివారం నిర్వహిస్తున్న “సినివారం”. సినివారం శీర్షికతో లఘుచిత్రాలు/డాక్యుమెంటరిలు/ఫీచర్ ఫిల్మ్స్ ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం.
ఈరోజు సినివారంలో…
1) శ్రీ డా. కావూరి శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో రూపొందిన “మెదక్ జిల్లా పరిశోధనాత్మక చిత్రం”
డాక్యుమెంటరి ప్రదర్శన చేశాం. ఈ డాక్యుమెంటరికి శ్రీ అడుసుమిల్లి కళ్యాణ్ బాబు నిర్మాత. 3500 సంIIల చరిత్ర కలిగి ఉన్న జిల్లా మెదక్. చరిత్ర ఆధారాలు పరిశీలించిన కొద్ది వివిధ పేర్లతో పిలవబడుతూ అనేక ప్రాంతాలుగా విభజన చెంది జిల్లాలుగా నామాంతరం చెందాయి. ఇలా నామాంతరం చెందిన జిల్లాల్లో “మెదక్ జిల్లా” (మెతుకు దుర్గం) ఒకటి. ఈ జిల్లాని శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, అసఫ్ జాహీలు, రాష్ట్రకూటులు పాలించారు. జిల్లాలోని శాసనాలు, మహా క్షేత్రాలు, మంజీర నది, ఏడుపాయలు, అతి ప్రాచీన విగ్రహాలు, కవులు, నేటి సిద్దిపేట్ జిల్లా, నేటి కొండాపూర్, పటాన్ చెరువు, అడవులు, ఆభయారణ్యం ఇలా అన్నింటి పై పరిశోధన చేసి రూపొందించిన డాక్యుమెంటరి ద్వారా ప్రేక్షకులకు మెదక్ జిల్లాకి ఉన్న గత చరిత్ర, ప్రస్తుత విశేషాలు తెలిసేలా రూపొందించారు.
మెదక్ జిల్లా పై పరిశోధనాత్మక డాక్యుమెంటరి రూపొందించిన దర్శకులు డా. కావూరి శ్రీనివాస్ మాట్లాడుతూ 2009లో ఈ డాక్యుమెంటరి తీసామని, ఇక్కడ ప్రదర్శనకు అవకాశమిచ్చిన హరికృష్ణగారికి ధన్యవాదలు తెలిపారు. ఇంకా కొన్ని ఇతర జిల్లాల పై పరిశోధనలు జరుపుతున్నానని గుర్తు చేశారు.
2) శ్రీ సతీష్ అక్కినపల్లి రచన, దర్శకత్వంలో రూపొందిన “L.M.D. కాలని బైపాస్ రోడ్” లఘుచిత్రం ప్రదర్శన చేశాం. ఈ సినిమా నిర్మాత బైర్నేని రవి ప్రసాద రావు. ఈ సినిమాకి అల్లే మధుబాబు పాటలు, రమణ కానూరి సంగీతం అందించారు. ఒకే కాలనికి చెందిన నలుగురికి అనుకోకుండా దొరికిన డబ్బు వాళ్ళ జీవితాల్లో తెచ్చిన అనూహ్యమైన మార్పులు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకులు సతీష్ అక్కినపల్లి గారు మాట్లాడుతూ నేను తీసిన తొలి సినిమా ప్రదర్శనకు మాకు అవకాశం కల్పించిన భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వానికి, సినివారం టీమ్ కు మాలాంటి ఫిల్మ్ మేకర్స్ కి ఇంత చక్కటి ఫ్లాట్ ఫామ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు, నా తొలి సినిమా ఇక్కడ ప్రదర్శన చేసినందుకు మా టీం పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ కావూరి గారు రూపొందించిన డాక్యుమెంటరీ లో శిలాశాసనాలు, విజ్ఞానాత్మకం, విశేషాలు, ఇతర సమాచారం పరిశోధనాత్మకంగా భాగుందని తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి గారు మాట్లాడుతూ “కవి కంటే ముందు సినిమా ప్రేమికుడిని” అని అన్నారు. శనివారంని సినివారంగా మార్చి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న హరికృష్ణగారు యువ ఫిల్మ్ మేకర్స్ ని ఒక గూటికి చేర్చి వారిలో ఉన్న సినిమా సృజనాత్మకతని వెలికి తీసే ప్రయత్నం చేయడం అభినందనీయమని, తొలిసారిగా వచ్చాను కానీ ఇంతమంది యువ సినీ ప్రేమికులని చూడటం సంతోషంగా ఉందని, ఈ “సినివారం వేదిక మంచి సినిమాలకు కేంద్రం కావడం, ఇది యువదర్శకులకు ప్రోత్సాహకంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు.
మెదక్ డాక్యుమెంటరి గూర్చి మాట్లాడుతూ జిల్లా వాసిగా చాలా సంతోషంగా ఉందని, అప్పట్లో ఒక కలెక్టర్ గారి ప్రయత్నంలో దొరకని విశేషాలని, పాండిత్యంతో, కవిత్వంతో వెలికి తీశారని అభినందించారు. ప్రాచీన తెలంగాణలో సంస్కృతం కన్నా ముందు స్థానిక భాషలు 8 భాషలుండేవని అన్నారు (పాకృత్వం, పైశాచీ భాషలు!). వాటిని కావూరి గారు పరిశోధనలో కనుగొన్నారు. చీకట్లో ఉన్న చరిత్రని వెలుగులోకి తీసుకురాటానికి కావూరి ప్రయత్నిస్తారని అనుకుంటున్నామని అన్నారు.
అనతరం సినిమా బృందాలను డా. నందిని సిధారెడ్డి గారు ప్రోత్సహిస్తూ అభినందనలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు దయానంద రెడ్డి, ప్రముఖ కవి సిద్దార్థ, నటులు వైభవ్ సూర్య, సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత, నటీనటులు, అలాగే ఈ సినిమా సాంకేతిక నిపుణులు, వారి కుటుంబ సభ్యులు, ఔత్సాహిక యువ ఫిల్మ్ మేకర్స్, సినీ ప్రేమికులు పలువురు పాల్గొననున్నారు.