డిసెంబర్ నాటికి ఇంటింటికి మంచినీరు
జడ్చర్ల నియోజకవర్గంలో పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
చెరువుల్లోకి చేప పిల్లలను వదిలిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
మహబూబ్నగర్ అక్టోబర్ 28 : కృష్ణమ్మ నీటితో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, డిసెంబర్ నాటికల్లా ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లా నీటీని సరఫరా చేస్తామని చెప్పారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. తెలంగాణ వస్తే ఏమొస్తదో చేసి చూపిస్తున్న ఘనత సీఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానిదన్నారు మంత్రి. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఆయా సమావేశాల్లో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు.రాజాపూర్ మండలం ఈద్గాని పల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాలమిత్ర కేంద్రాన్ని ప్రారంభించారు. మంచినీటి పథకం సుజలాన్ని ప్రారంభించారు. చెరువులో చేప పిల్లలను వదిలారు. అలాగే ఈద్గానిపల్లి శివారు నాన్ చెరువు తండాలో ఎస్టీ కమ్యూనిటీ హాలుకు శఃకుస్థాపన చేశారు. ఇదే తండాలో రూ.12లక్షలతో నిర్మించనున్న హనుమాన్ దేవాలయానికి మంత్రి భూమిపూజ చేశారు. రూ.18లక్షలతో త్వరలోనే బీటీ రోడ్డును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిడ్చిల్ మండలం బోయిన్పల్లి, ఉర్కొండ మండలం మాదారం గ్రామాల్లోని చెరువుల్లోకి చేపలను వదిలారు.ఆయా సభల్లో మంత్రి మాట్లాడుతూ, కృష్ణానది నీటితో పాలమూరు జిల్లా ప్రజల పాదాలు కడుగుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్లోకి తెచ్చామని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటిని కల్వకుర్తి ప్రాంతానికి తెచ్చామన్నారు.
ఇక పాలమూరు ప్రాజెక్టు ద్వారా జిల్లా మొత్తానికి నీటిని అందించే కార్యక్రమం మొదలైందన్నారు. వలసలు వాపస్ వస్తున్నాయన్నారు. అదృష్ట వశాత్తు ఈ సారి మంచి వర్షాలు పడి, జిల్లాలోని చెరువులు, కుంటలు నిండాయని మంత్రి తెలిపారు. మన శ్రమకి ప్రకృతి కూడా సహకరిస్తే అంతా మంచే జరుగుతుందన్నారు. మరోవైపు పేదల సంక్షేమం, అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా భారీ ఎత్తున పథకాలు అమలు అవుతున్న రాష్ట్రం కూడా మనదేనని మంత్రి చెప్పారు. ఆయా పథకాలను మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రితోపాటు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.