లక్ష్మీ నరసింహుడి సేవలో ఎంపీ కవిత
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంపీ కవిత పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. ఎంపీ కవితకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంపీ కవిత వెంట ప్రభుత్వ విప్ సునీత, మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి ఉన్నారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ కవిత పరిశీలించారు. ఆలయ ఈవో గీత.. దగ్గరుండి పనులు జరుగుతున్న తీరును ఆమెకు వివరించారు. ఆలయంగోపురం పనులు, కాటేజీల నిర్మాణం, గుట్టకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఎంపీ కవిత పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని స్వామిని కోరుకున్నట్టు ఎంపీ కవిత చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అందులోభాగంగానే ఇప్పటికే 650 కోట్లకు పైగా నిధులు వెచ్చించిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రభుత్వమే ఆల య అభివృద్ధి పనులను ముందుండి నడిపిస్తుందన్నారు.
అంతకముందు భువనగిరి పట్టణానికి చెందిన దివంగత జాగృతి నాయకుడు వేణు కుటుంబాన్ని ఎంపీ కవిత పరామర్శించారు. వారి కుటుంబానికి ఐదులక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.