నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భూములను శర వేగంగా సేకరించాలి – వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు
నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన భూములను శర వేగంగా సేకరించాలని, ఆ వెంటనే వైద్యారోగ్యశాఖకు అప్పగించాలని సంబంధిత జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు ఆదేశించారు. ఆ రెండు మెడికల్ కాలేజీల ఏర్పాటు పై ఇద్దరు మంత్రులు సెక్రటేరియట్ లోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చాంబర్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ, నిర్ణీత భూమిని మెడికల్ కాలేజీలకు కేటాయించాలన్నారు. ఆ భూమికి సంబంధించిన వివరాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపించాలన్నారు. నల్లగొండ, సూర్యాపేటల్లో ప్రస్తుతం నడుస్తున్న వైద్యశాలల పరిధిలో ఉన్న భూమి సరిపోదన్నారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగానేగాక, జిల్లా వైద్యశాలలుగా ఆయా హాస్పిటల్స్ని అభివృద్ధి పరచాలని, అందుకు అవసరమైన విస్తరణకు మరింత భూమి అవసరమవుతుందన్నారు. అందువల్ల ఒక్కో మెడికల్ కాలేజీకి కనీసం 20 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలని మంత్రులు అధికారులకు చెప్పారు. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న భూములను సమీక్షించారు. అవసరమైతే జిల్లా కేంద్రానికి 10 కి.మీ.లోపు రేడియస్ లో భూ సేకరణ చేయాలని నిర్ణయించారు. అలాగే మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణాలు, వైద్యశాలల నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు. జులై 7వ తేదీ లోగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి అనుమతుల కోసం అన్ని రకాల ఫార్మాలిటీలు పూర్తి చేయాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో ఇద్దరు మంత్రులతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ బి శివప్రసాద్, tsmsidc md వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.