త్రిపుర రాష్ట్ర రాజధాని ఆగర్తల శివారులోని జోగేందుర్ నగర్ లో ఉన్న త్రిపుర రాష్ట్ర వెదురు పారిశ్రామిక వాడను అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ సోమవారం సందర్శించారు..
మేధర కుల వృత్తి దారులు ఆధునిక విధానాన్ని అనుసరించేందుకు త్రిపుర వెదురు చేతి వృత్తి కళ ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయ పడ్డారు. వెదురుతో త్రిపుర రాష్ట్రంలో తయారవుతున్న పలు రకాల ఉత్పత్తులను మంత్రి జోగు రామన్న, చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పరిశీలించారు. జోగేందుర్ నగర్ లోని ఉనకోటి క్రాఫ్ట్స్ సెంటర్ ను కూడా వారు సందర్శించారు. అక్కడ రబ్బరు తో తయారయ్యే కలప ఉత్పత్తులను కూడా పరిశీలించారు. రబ్బరు కలప మేధర కుల వృత్తి దారులకు వరంగా మారుతుందని వారు పేర్కొన్నారు.
మేధర కులస్తులకు ఆధునిక యంత్రాలను సమకూర్చి, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా వారికి మెరుగైన జీవనాన్ని కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వారు పేర్కొన్నారు. రబ్బరు కలపతో పలు రకాల ఫర్నిచర్ తయారు చేసే విధానాన్ని వారు గమనించారు.
త్రిపుర రాష్ట్రంలో 11,630 హెక్టార్లలో రబ్బరు చెట్లు ఉన్నాయని, తద్వారా 60 వేల మెట్రిక్ టన్నుల రబ్బరు ఉత్పత్తి అవుతోందని, దీనితో ప్రతి ఏటా రూ.10 కోట్ల లాభాలను ఆర్జిస్తున్నట్లు త్రిపుర అధికారులు తెలిపారు. త్రిపుర రాష్ట్ర ప్రతిష్టాత్మక హస్త కళా కేంద్రాన్ని మంత్రి జోగు రామన్న, చైర్మన్ తాడూరి శ్రీనివాస్ సందర్శించారు. త్రిపుర రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పలు హస్త కళా వైభవాన్ని స్వయంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుకున్నారు.
అనంతరం ఆగర్తల శివార్లలో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దును సందర్శించి.. ఇండియా-బంగ్లాదేశ్ సైనికుల కవాతును తిలకించారు.
ఈ కార్యక్రమాల్లో ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తుల శ్రీనివాస్, మేధర కుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు