ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతం
న్యాయపర ఇబ్బందులు లేని నోటిఫికేషన్లు
శాఖల వారిగా ఉద్యోగాల ఖాళీలు, భర్తీకి విద్యార్హతలు, రోష్టర్ సిద్ధం చేయాలి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్ఆగష్టు16(ఎక్స్ ప్రెస్ న్యూస్): ఉద్యోగాల నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయపర అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్లు జారీ చేసి వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు న్యాయపర ఇబ్బందులు రాకుండా వేగంగా నియామకాలు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, టిఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, టిఎస్పీఎస్సీ మెంబర్ సెక్రటరీ వాణి ప్రసాద్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావుతో సమావేశం జరిగింది.ముఖ్యమంత్రి కేసిఆర్ ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ నుంచి తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఖాళీలను భర్తీచేస్తామని చెప్పడమే కాకుండా శాఖల వారిగా ఖాళీల సంఖ్యను కూడా వెల్లడించారు. గౌరవ సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి, న్యాయపర ఇబ్బందులు లేకుండా టిఎస్పీఎస్సీ ద్వారా వెంటనే నోటిఫికేషన్లను ఇవ్వడానికి గల మార్గదర్శకాలను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు.
నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఎదురవుతున్న న్యాయపర, ఇతర ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఇప్పుడు అమలులో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాత పదిజిల్లాలను ప్రాతిపదిక చేసుకుని నోటిఫికేషన్లు ఇవ్వాలా? కొత్తగా ఏర్పాటు చేసుకున్న 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్లు జారీచేయాలా? అన్న అంశంపై న్యాయశాఖ తన ప్రతిపాదనలు, సలహాలు వెంటనే ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అడిగారు. అదేవిధంగా ఈ ఖాళీల భర్తీ జాప్యం కాకుండా ఉండేందుకు శాఖల వారిగా ఖాళీల సంఖ్యను గుర్తించి, వాటి భర్తీకోసం అభ్యర్థులకు కావాల్సిన విద్యార్హతలు, రోస్టర్ పాయింట్లను కూడా రూపొందించాలని ఆదేశించారు.ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో మరోసారి ఇదే అంశంపై సమావేశం కావాలని నిర్ణయించారు.