నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
శ్రీ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనము, రక్షాబంధనము, మృత్సంగ్రహణం, అంకూరారోపణలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు
కళావైభవం.కామ్ ప్రతినిధి శంకర్ పోతు గంటి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2021 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు సోమవారం స్వస్తివాచనం, అంకురార్పణం, విశ్వక్సేనారాధనతో అర్చకులు, పారాయణికులు అత్యంత వైభవంగా ప్రారంభించారు.
స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ విదియ సోమవారం తేది.15.03.2021 నుండి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి గురువారం తేది.25.03.2021 వరకు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు 11 రోజులపాటు అత్యంత వైభవముగా జరుగనున్నాయి.
శ్లో|| మంగళం నరసింహాయ – మంగళం గుణసింధవే |
మంగళానాం నివాసాయ – యాదాద్రీశాయ మంగళమ్ ||
స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ విదియ సోమవారం తేది.15.03.2021 నుండి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి గురువారం తేది.25.03.2021 వరకు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు 11 రోజులపాటు అత్యంత వైభవముగా జరుగనున్నాయి.
శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా ఈ రోజు తేది.15.3.2021 సోమవారం ఉదయం శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్య ఆరాధనల అనంతరం ఉదయం గం.10.00లకు శ్రీ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనము, రక్షాబంధన కార్యక్రమములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా ప్రధానార్చకులు, యాజ్ఞాచార్య బృందము, ఆలయ ఉప ప్రధానార్చకులు, అర్చక, బృందము, పారాయణీకులు ఈ వేడుకలను అత్యంత వైభవముగా నిర్వహించారు
ఈ వేడుకలలో, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ విష్వక్సేన ఆరాధన:
విశ్వశాంతి లోకకళ్యాణం కొరకు ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకలో లోకములకు శుభములు కలగాలని వేదమంత్రములు పఠిస్తూ విష్ణు గణాలకు అధిపతియైన శ్రీ విశ్వక్సేనుడిని ఆరాధించారు. అంతటా వ్యాపించిన తత్వం సాక్షాత్ భగవానుని స్వరూపమని పురాణాలు తెలియజేయుచున్నాయి. దేవతలు ప్రార్థించగా శ్రీ మన్నారాయణుడు తనంతటి బలసంపన్నుడయిన అతనిని అవతరింపజేసాడు వారే విష్వక్సేనులవారు. వీరి అధ్యక్షతన బ్రహ్మోత్సవములు ఆద్యంతం నిర్విఘ్న పరిసమాప్తి కావలెనని ఈ వేడుక నిర్వహిస్తారు.
స్వస్తివాచనము:
దేశ, కాల, పాత్ర శుద్ధి జరగాలని భగవంతుని అర్చించుటకు యోగ్యత మనకు కలగాలని ఈ స్వస్తివాచన వేడుకను నిర్వహించెదరు. భగవంతుని సేవ వదలి ఇతర భోగములను అనుభవించి ఉన్నందున వాటన్నింటియందు పవిత్రీకరణ జరిగి దోషములు తొలగి గుణములు కలగాలని తద్వారా విశ్వశాంతి కలగాలని ఈ వేడుక నిర్వహిస్తారు.
రక్షాబంధనము:
బ్రహ్మోత్సవములలో రక్షాబంధన వేడుక ఎంతో విశిష్టమైనది. సర్వకళ్యాణ జనకం, సర్వశత్రు వినాశనం, ఆయూరోగ్య ప్రదాయకం, సంతానప్రదం మొదలగు ఎన్నో ఫలితములు ఈ వేడుకలో కలవు. భగవంతుని ఆరాధించుటకు రక్షాబంధనములు తండుల పాత్రల యందు ఉంచి విమల మొదలగు అష్టదళ శక్తి దేవతలను ఆవాహన చేసి మంత్రములతో ధూపదీపములు సమర్పించి స్వామి వారికి కుడి చేతికి, అమ్మవారికి ఎడమ చేతికి కంకణధారణ చేయుదురు. శ్రీ స్వామి వారికి అమ్మవారికి సమర్పించిన అనంతరం భగవానుడి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కళ్యాణకరమైన రక్షాబంధనములు భక్తులు దరించెదరు. ఒక పవిత్రమైన భావన ఏర్పడి భగవంతుని త్రికరణ శుద్ధిగా సేవించుటకు యోగ్యత పొందుటకు ఈ వేడుక నిర్వహిస్తారు.
సాయంకాల కార్యక్రమములు:
ఈ రోజు సాయంకాలము నిత్యఆరాధనల అనంతరము శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలలో భాగంగా సాయంత్రం గం.6.30ని||లకు మృత్సంగ్రహము, అంకురారోపణ కార్యక్రమములను ప్రధానార్చకులు, యజాచార్యులు, అర్చకబ్బందము, పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మృత్సంగ్రహణం, అంకూరారోపణ ప్రత్యేకత:
శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవములలో మొదటి రోజు అంకురారోపణ వేడుక నిర్వహించెదరు. అంకురారోపణకు అవసరమగు మట్టిని సంపాదించడానికి ఊరేగింపుగా మంగళ వాయిద్యములతో వెడలి భూమాతను పూజించి పుట్టమన్ను స్వీకరించి ఈ మట్టిని క్రొత్త పాలికలలో వేసి వాటిలో నవధాన్యములు ఉంచి మంత్ర జపములతో ప్రోక్షణ చేసి తొమ్మిది సాలికలలో ఆయా మంత్రములతో ఆవాహనలు గావించెదరు. చంద్రుడు ఎలా దిన దిన అభివృద్ధి చెందుతాడో అలాగే ఈ పాలికలలలోని నవధాన్యాలు అభివృద్ధి చెందుతూ లోకమంతా సస్యశ్యామలంగా ఆహారధాన్యాల కొరత లేకుండా సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీని పూజించడం ఈ వేడుకలోని ప్రత్యేకత.